పెను తుఫానుగా ‘ఫొణి’


తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్’కు మరో తుఫాను పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి ‘ఫొణి’గా నామకరణం చేశారు. శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.

మరో 24 గంటల్లో ‘ఫొణి’ పెనుతుపానుగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపారు. తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరంవైపు 45 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు.