వైరల్ : ‘కేజీఎఫ్‌ 2’లో ఛాన్స్ కోసం వేలమంది


కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయం తీసుకెళ్లిన సినిమా ‘కేజీఎఫ్‌’. యశ్‌ కథానాయకుడి పాత్ర పోషించారు. ప్రశాంత్‌ దర్శకుడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ ‘కేజీఎఫ్‌ 2’ రాబోతుంది. ఇందులో సంజయ్‌ దత్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం కొత్త ఆర్టిస్టులు కావాలని ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి విపరీతమైన స్పందన వచ్చింది.

ఒక్క ఛాన్స్ కోసం వేలాది మంది యువకులు క్యూలో నిలబడ్డారు. 8 నుంచి 16 ఏళ్ల వయసున్న అబ్బాయిలు, 25 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పురుషులు కావాలని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్‌ 26న బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న ఓ హోటల్‌లో ఆడిషన్స్‌ జరుగుతాయని తెలిపింది. అంతేకాదు ఏదో ఒక డైలాగ్‌ చెప్పాలని, అది దాదాపు నిమిషం ఉండాలని కోరింది. వేల సంఖ్యలో ప్రజలు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.