పది ఫలితాలు.. పకడ్భంధీగా !

ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నేపథ్యంలో పదో తరగతి ఫలితాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. శనివారం పది ఫలితాలపై మీడియా ఆయన్ని పలకరించింది. ఫలితాల్లో ఎటువంటి సాంకేతిక పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మే నెల రెండో వారంలో పది ఫలితాలు ఇస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 26తో పూర్తయింది. మొత్తం 52.55 లక్షల జవాబుపత్రాలను మూల్యాంకనం చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఇక వచ్చే యేడాది నుంచి పరీక్షలకు ఓఎంఆర్‌ పత్రంలో తేదీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, మూల్యాంకనం చేసేవారు తేదీని కూడా బబ్లింగ్‌ (గడులు దిద్దడం) చేయాలని విజయ్‌కుమార్‌ తెలిపారు. దానివల్ల ఏ రోజు ఎన్ని జవాబుపత్రాలు దిద్దారనే స్పష్టత ఉంటుందన్నారు