రాళ్లపల్లికి సినీ ప్రముఖుల సంతాపం

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) శుక్రవారం కన్నుమూశారు. రాళ్లపల్లి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా రాళ్లపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ట్విట్టర్ వేదికగా రాళ్లపల్లి మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

“తెలుగు నాటక, సినీ చరిత్రకు మీ సేవలు చిరస్మరణీయం రాళ్లపల్లి గారు.
మీలాంటి ఔనిత్యమయిన మనిషి మా మధ్య లేరు అనే విషయం మమల్ని దహించివేస్తుంది.
మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ త్రివిక్రమ్ ట్విట్ చేశారు. ‘నాకు చాలా ఇష్టమైన నటుడు. ఆయన ఆత్మకి శాంతిచేకూరాలని’ నాని ట్విట్ చేశారు.

రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 8వేలకు పైగా నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు.1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. 850కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు.\