నవీన్‌ పట్నాయక్‌.. ఐదోసారి !

ఒడిశా ముఖ్యమంత్రిగా బిజు జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ వరుసగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నవీన్ ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్‌ గణేశీ లాల్‌ నవీన్ చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు మరో 21 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బిజు జనతాదళ్‌ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 147 స్థానాలకు గానూ 112 చోట్ల బీజేడీ విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదోసారి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ఏర్పడింది. నవీన్‌ పట్నాయక్‌ హింజిలి, బిజాపూర్‌ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేడీ జయకేతనం ఎగురవేసింది. ఒడిశాలో 21 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ 12 చోట్ల విజయం సాధించింది.