మహేష్ కు ఓ లైన్ చెప్పా


‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఉంటుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ‘మహర్షి’ తర్వాత మహేష్ దర్శకుడు అనిల్ రావిపూడికి ఓకే చెప్పారు. వీరి కలయికలో ‘సరిలేరు నీకెవ్వరు’ రాబోతుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ కోసం రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొర‌టాల శివ‌.. రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ తో సందీప్ సినిమా లేనట్టే అనుకొన్నారంతా. ఐతే, వాస్తవం ఏంటంటే ? ఇప్పటికే సందీప్ మహేష్ కి ఓ లైన్ వినిపించారు. అది మహేష్ కి నచ్చింది.

పూర్తికథని రెడీ చేయమని మహేష్ చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ నే చెప్పారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘కబీర్ సింగ్’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సందీప్ మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘మహేష్ కి ఓ లైన్ చెప్పా. పూర్తి కథని రెడీ చేయమన్నారు. ఏం జరుగుతుందో చూడాలి’ అన్నారు. పూర్తి స్క్రిప్ట్ మహేష్ కి నచ్చితే సరిలేరు నీకెవ్వరు తర్వాత సందీప్ దర్శకత్వంలోనే మహేష్ సినిమా ఉండనుంది.