ఆంధ్ర ఎమ్మెల్యేకు ‘కేసీఆర్ దేవుడు’గా కనిపించాడు

రాష్ట్ర విభజనకు ముందు పరిస్థితి వేరు. కానీ, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆంధ్రా నేతలు ఆరాధిస్తున్నారు. ఇందుకు అమరావతి శంకుస్థాపన, పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి వేడుకకు సీఎం కేసీఆర్ వెళ్లినప్పుడు చేసిన గౌరవ మర్యాదలే సాక్ష్యం. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ని ఏకంగా దేవుడుతో పోల్చడం ఆకట్టుకొంటోంది.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ మంగళవారం తెలంగాణ అసెంబ్లీకి విచ్చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా మిత్రులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఎక్కువగా జరుపుతున్నారు. అదే ఏపీలో అయితే బడ్జెట్ సమావేశాలే 14 రోజులు కూడా జరపరు. ప్రతిపక్ష నేతలకు కనీసం 5 నిమిషాలు కూడా మైక్ ఇవ్వరని వాపోయారు. అదే టీ-అసెంబ్లీలో విలువైన చర్చ జరుగుతుందని చెప్పుకొచ్చాడు.