ఎమ్మెల్యే రాజాసింగ్ సొంతంగా గాయపరచుకొన్నాడా ?


గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గాయాలయ్యాయి. బుధవారం అర్థరాత్రి పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో స్వాతంత్య్ర సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. ఐతే, ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు చేసిన లాఠీచార్జ్ లో రాజాసింగ్ కు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఐతే, పోలీసులు మాత్రం రాజాసింగ్ తనని తాను సొంతంగా గాయపరచుకొన్నారుని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్ శ్రీనివాస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇందులో బండరాయితో ఎమ్మెల్యే రాజాసింగ్ తలని బాదుకోవడం చూడొచ్చు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎమ్మెల్యే ఇంకా స్పందించాల్సి ఉంది.