బ్రేకింగ్ : అటవీ సిబ్బందిపై మరో దాడి

కొమరం భీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఎమ్మెల్యే తమ్ముడి దాడిని మరువక ముందే మళ్లీ అదే తరహా మరో ఘటన చోటుచేసుకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారులపై పోడు సాగుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో కొంతమంది పోడుదారులు ట్రాక్టర్లతో అటవీశాఖకు చెందిన భూమిని దున్నుతున్నారన్న సమాచారంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సెక్షన్‌ ఆఫీసర్‌ నీలమయ్య, బీట్‌ ఆఫీసర్లు భాస్కరరావు వాళ్ల ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించే సమయంలో ఒక్కసారిగా వాళ్లంతా అధికారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరి అధికారుల వీపుపై గాయాలయ్యాయి. అక్కడనుంచి తప్పించుకున్న అటవీ అధికారులు ముల్కలపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమన్‌ తెలిపారు.