ఐఎస్‌ఎల్‌ సీజన్-4 ఘనంగా ప్రారంభం

ఐపీఎల్ హంగామా ముగింది. ప్రో కబడ్డీ సందడి ముగిసింది. ఇప్పుడు మరో సంబరం ప్రారంభమైంది. ఐఎస్ఎల్ – 4 (ఇండియన్‌ సూపర్‌ లీగ్‌) సీజన్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఏకంగా నాలుగు నెలల పాటు ఫుట్‌బాల్‌ ప్రియులకు వినోదం పంచనుంది. నవంబరు 17న ప్రారంభమయ్యే ఈ టోర్నీ 2018 మార్చి 18న ముగియనుంది. గతేడాది విజేత, రన్నరప్‌గా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా- కేరళ బ్లాస్టర్స్‌ మధ్య ఈ రోజు తొలి మ్యాచ్‌ జరగనుంది.

కోచిలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, హీరోయిన్ కత్రినా కైఫ్‌ చేసిన డ్యాన్సులు హైలైట్ గా మారాయి. ఈ ఏడాది టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. బెంగళూరు ఎఫ్‌సీతో పాటు జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ ఈ సీజన్‌లో అరంగేట్రం చేస్తున్నాయి. కేరళ బ్లాస్టర్‌ జట్టుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ సహ యజమాని అన్న సంగతి తెలిసిందే.