కర్ణాటక సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి గురువారంతో పులిస్టాప్ పడనున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్‌లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ రమేష్ ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ ని విచారించిన సుప్రీం.. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని స్పష్టం​ చేసింది. అదేసమయంలో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చని తెలిపింది.

ఈ నేపథ్యంలో గురువారం కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. రేపు జరగనున్న బలపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది రెబెల్‌ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని ఎవరూ బలవంతపెట్టలేరని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో కుమార స్వామి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవడం దాదాపు అసాధ్యం. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయినట్టేనని చెప్పుకొంటున్నారు.