ఆ నటి డేటాని దొంగలించారట !


తల్లి-కొడుకు కలిసి నటి డేటాని చాలా తెలివిగా దొంగలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సినీ నటి, సామాజిక కార్యకర్త రాధాప్రశాంతి కి గత నాలుగేళ్లుగా ప్రముఖ డిజైనర్‌ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఉంది. ఇటీవలే ఆమె చీరల డిజైన్స్ చూపించడానికి కొడుకు చక్రితో కలిసి ప్రశాంతి ఇంటికి వచ్చింది.

చక్రి తన ల్యాప్‌టాప్‌లోని చీరల డిజైన్లు రాధాప్రశాంతి సెల్‌ఫోన్‌లోకి పంపుతానని చెప్పగా.. వాట్సాప్‌ ద్వారా పంపాలని ఆమె సూచించింది. తన సెల్‌ఫోన్‌ పని చేయడం లేదని చెప్పిన అతను ఆమె సెల్‌ఫోన్‌ తీసుకొని గంటన్నర తర్వాత తిరిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీరా చూస్తే సెల్ ఫోన్ లో డిజైన్స్ లేవు. దీంతో పాటు ప్రశాంతి సెల్ ఫోన్ డేటా దొంగలించబడింది. దీనిపై చక్రి, ఆమె తల్లిని ప్రశ్నించగా సరైన సమాధానం లేదు. దీంతో ప్రశాంతి బంజారాహీల్స్ పోలీసులని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.