సొంత ఛానెల్ స్టార్ట్ చేసిన మహేష్ కూతురు

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార మహా ముదురు అన్న సంగతి తెలిసిందే. ఆ చిన్నారి చేసిన అల్లరికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తన అల్లరిని ప్రేక్షకులకి చూపించేందుకు సొంత యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది సితార. తన స్నేహితురాలు ఆద్యా (దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు)తో కలిసి ఏ అండ్‌ ఎస్‌ (A & S) పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది.

ఈ చానల్‌లో తొలి వీడియోను ఈ రోజు పోస్ట్ చేశారు. ‘3 మార్కర్స్‌ చాలెంజ్‌’ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్‌ ఫిల్ చేయటంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా అవుతోంది. చిన్నారులిద్దరు ఏమాత్రం భయం లేకుండా కనిపించారు. సితార, ఆద్యాల వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన మహేష్.. చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.

మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ తొలి షెడ్యూల్ షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. అక్కడ మహేష్ ఆర్మీ ఆపీసర్ గా కనిపించే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఇందులో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకురానుంది.