డైరెక్టర్స్‌ ట్రస్ట్‌ కోసం భారీ విరాళాలు


టాలీవుడ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ఏర్పాటైంది. దర్శకుల ట్రస్టుని ఏర్పాటు చేయాలన్నది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బలమైన కోరిక. ఆ కోరికని పలు సందర్భాల్లో వెలుబుచ్చారు. ఇన్నాళ్లకి దానికి కార్యరూపం తీసుకొచ్చారు. మే 4న దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శకేంద్రుడు తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌కి రాఘవేంద్రరావు ఛైర్మన్‌గా , వివి వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, మెహెర్ రమేష్, కొరటాల శివ, నందినీ రెడ్డి, రాంప్రసాద్‌, బి.వి.ఎస్‌.ర‌వి ట్రస్టీలుగా నియమితులయ్యారు.

దీని ద్వారా సంఘ సభ్యులలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆరోగ్య, విద్య కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకుని దాని నుంచి వచ్చే వడ్డీతో అర్హులైన వారికి చేయూతనిద్దామని దర్శకేంద్రుడు తెలిపారు. డైరెక్టర్స్ ట్రస్ట్ కి రాజమౌళి రూ.50 లక్షలు, రాఘవేంద్రరావు రూ.10 లక్షలు, ఆర్కా మీడియా వారు రూ.15 లక్షలు, మెగాస్టార్ చిరంజీవిరూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.