సూర్య కూడా సైడ్ అయిపోయాడు


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాధితుల లిస్టు రోజు రోజుకి పెరుగుతోంది. ఆయన తాజా చిత్రం ‘సాహో’. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రమిది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఐతే, ఆగస్టు 15న రావాల్సిన సాహో 15రోజుల ఆలస్యంగా ఆగస్టు30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ ఇతర సినిమాలపై గట్టిగానే పడింది.

నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేటు ఆగస్టు30 అంటూ ప్రకటించేశారు. ఇప్పుడీ సినిమా సాహో ఎఫెక్ట్ తో సెప్టెంబర్ 13కి వెళ్లింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సింది. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 12కి వెళ్లింది. తాజాగా సాహో ఎఫెక్ట్ తో మరో సినిమా వాయిదాపడింది.

తమిళ్ స్టార్ సూర్య ‘బందోబస్త్’ను ముందుగా ఆగస్టు 30న రిలీజ్ ప్రకటించారు. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 20 కి వాయిదా పడింది. ఈ మేరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి కేవీ ఆనంద్‌ దర్శకుడు. మోహన్‌లాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. మొత్తానికి ప్రభాస్ బాధితుల లిస్టులో నాని, వరుణ్ తేజ్, సూర్యలు చేరిపోయారు. పరోక్షంగా మరికొంతమంది హీరోలపై సాహో ఎఫెక్ట్ పడినట్టు కనిపిస్తోంది.