కశ్మీర్‌ విభజనబిల్లుకు రాజ్యసభ ఆమోదం


జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ బిల్లును ఈ రోజు ఉదయం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ జరిగింది.

హోంమంత్రి వివరణ అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. సాంకేతిక సమస్య రావడంతో స్లిప్పులతో ఓటింగ్‌ చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదావేశారు. ఇవ్వాళే ఈ బిల్లుని అమిత్‌ షా లోక్‌సభలోనూ ప్రవేశపెట్టారు. రేపు లోక్ సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది.

ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాదు. ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. దీంతో దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కానున్నాయి.