మరో రెండ్రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారడమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం వద్ద ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.

రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలోని చాలా చోట్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఈ రోజు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.