సుష్మా స్వరాజ్‌ రూ.1 బాకీ పడ్డారు


ప్రముఖ న్యాయవాది హరీష్‌ సాల్వేకు సుష్మా స్వరాజ్ రూ. 1 బాకీ పడ్డారు. ఆమె చనిపోవడానికి కేవలం గంట ముందు హరీష్‌ సాల్వేతో మాట్లాడారట. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున వాదించి హరీష్ కేసు గెలిచిన విషయం తెలిసిందే. కేసు గెలవడంతో తనకు ఇవ్వాల్సిన రూ.1 ఫీజు తీసుకోవడానికి రేపు సాయంత్రం 6గంటలకి రావాలని సుష్మా కోరిందట.

“ఆమెతో నేను రాత్రి 8.50గంటల సమయంలో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఉద్వేగంగా సాగింది. ‘మీరు కేసు గెలిచారు కదా.. దానికి నేను మీ రూ.1 ఫీజు ఇచ్చేయాలి వచ్చి కలవండి’ అన్నారు. దానికి నేను, ‘అవును మేడం ఆ విలువైన రూపాయిని నేను తీసుకోవాల్సిందే’ అని బదులిచ్చాను. దీంతో ఆమె ‘మరి రేపు 6గంటలకు రండి’ అన్నారు” అంటూ సుష్మాతో సాగిన సంభాషణను హరీష్‌ సాల్వే గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. హరీష్ కి సుష్మా ఇచ్చిన సమయంలోనే ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయి.