తరుణ్ కి యాక్సిడెంట్.. ఫేక్ న్యూస్ !


టాలీవుడ్ హీరో తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఉదయం నార్సింగ్‌ పీఎస్ పరిధిలోని అల్కాపూర్‌లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో తరుణ్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ప్రమాదం తర్వాత తరుణ్ వేరే కారులో వెళ్లిపోయారని టీవీ ఛానెల్స్ న్యూస్ ని ప్రసారం చేశాయి. ఐతే ఇదంతా ఫేక్ న్యూస్ అని తరుణ్ తల్లి రోజా రమణి స్పష్టం చేశారు. తరుణ్ ఇంటోనే ఉన్నాడని తెలిపింది.

ఈ యాక్సిడెంట్ వార్తలపై స్వయంగా తరుణ్ నే స్పందించారు. ఓ టీవీ ఛానెల్ తో ఫోన్ లైన్ లో మాట్లాడారు తరుణ్. అసలు తనకేం కాలేదు. తాను క్షేమంగా ఉన్నా. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా. ప్రమాదానికి గురైన కారు తనది కాదు. తనకి జాగ్వార్, స్కోడ్ కార్లు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి న్యూస్ ని ప్రసారం చేసేటప్పుడు నిజాలు తెలుసుకొని చేస్తే బాగుంటుందని తరుణ్ సూచించారు.

మరోవైపు, ప్రమాదానికి గురైన కారు తరుణ్ దేనని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత కారులోంచి తరుణ్ దిగడం చూశాం. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన వేరే కారులో వెళ్లిపోయారని చెబుతున్నారు.