గుడ్ న్యూస్ : ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభం

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆయా ఆస్పత్రుల ప్రతినిధులతో మరో దఫా చర్చలు జరిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి.