‘ఛలో ఆత్మకూరు’ సుఖాంతం !

ఎట్టకేలకు ‘ఛలో ఆత్మకూరు’ సుఖాంతం అయింది. గుంటూరు నగరంలోని అరండల్ పేటలో తెదేపా ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల శిబిరంలో ఉన్నవారిని పోలీసులు స్వగ్రామాలకు తరలిస్తున్నారు. వైకాపా బాధితులంటూ ఆత్మకూరులో దాదాపు 200మందితో ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసింది తెదేపా. ‘ఛలో ఆత్మకూరు’ పేరుతో వారిని పరామర్శించి, వాళ్లని సొంత ఊళ్లకి పంపించాలన్నది టీడీపీ ప్లాన్. తద్వారా వైకాపా దాడులని ఎండగట్టాలని భావించింది. ఐతే, తెదేపా వ్యూహాన్ని జగన్ ప్రభుత్వం తిప్పికొట్టింది. తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు, ఇతర తెదేపా నేతలని గృహ నిర్భంధం చేసింది.

తెదేపా ఏర్పాటు చేసిన వైకాపా బాథితుల శిబరంలో ఉన్న.. ఆ పార్టీ నేతలని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బాధితులతో పోలీసులు చర్చలు జరిపింది. వారి సమస్య ఏంటి?ఎందుకు ఈ శిబిరానికి రావాల్సి వచ్చిందని ఆరాతీశారు. వారికి భద్రతాపరమైన హామీలు ఇవ్వడంతో పాటు వారిని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఒప్పించి వాంగ్మూలాలను సేకరించారు. తొలి విడతగా 35 మందిని వారి స్వగ్రామాలకు గ్రామాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. బస్సుల్లో ఎక్కించి వారి గ్రామాల్లో ధైర్యంగా అడుగు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేసిన పోలీసులు..వారంతా సాధారణ జీవనం సాగించేలా ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. దీంతో ఏపీలో ‘ఛలో ఆత్మకూరు’ హీట్ తగ్గినట్టయింది.