మోడీ2.O.. ఇది ట్రైలర్ మాత్రమే !

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్టికల్ 370రద్దు, జమ్ముకశ్మీర్ విభజన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో రెండో దఫా మోడీ ప్రభుత్వం 100రోజుల పాలనని పూర్తి చేసుకొంది. ఐతే, ఈ వందరోజుల పాలన ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. గురువారం ఝార్ఖండ్ లోని రాంచీలో పర్యటించిన ప్రధాని.. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎన్డీయే -2 ప్రభుత్వం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజలకు సమర్థమైన, వేగంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామని.. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోడీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ పీవోకే అని చెబుతున్నారు. బహుశా.. అదే మోడీ ప్రభుత్వం చూపించబోయే బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందేమో.. !