‘సైరా’ ఫంక్షన్ కి వర్షం అడ్డంకి !


మెగా అభిమానులకి వరుణుడు తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ నెల 18న జరగాల్సిన మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఈ రోజుకి (సెప్టెంబర్ 22)కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో సైరా ప్రీ రిలీజ్ వేడుకని ఈ నెల 18 నుంచి 22కి మార్చారు. కానీ, ఈరోజు కూడా వరుణుడు వదల్లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. ఐతే, వేడుకకి వర్షం అడ్డంకిగా మారింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్, వివి వినాయక్, కొరటాల శివ ప్రసంగాలని రెండు మాటల్లో పూర్తి చేశారు. ఈ వేడుక వేదికగా మెగా అభిమానుల కడుపు నిండిపోతుందని అనుకొన్నారు. సైరాపై చరణ్, మెగా యంగ్ హీరోలు, ఇతర అతిథుల మాటలు వినాలని ఆశపడ్డారు. కానీ వర్షం కంగారు పెట్టడంతో అభిమానులకి నిరాశతప్పలేదు. ఐతే, మాట్లాడినవారిదీ అందరిదీ ఒక్కటే మాట. సైరా బ్లాక్ బస్టర్ హిట్. చరిత్ర సృష్టించబోతుంది. రికార్డు బద్దలవ్వబోతున్నాయిని.