16యేళ్ల తర్వాత మహేష్.. మళ్లీ అక్కడ !

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్స్ లో ‘ఒక్కడు’ ఒక్కటి. మహేష్ ని స్టార్ ని చేసిన సినిమా ఇది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహేష్ కి జంటగా భూమిక నటించారు. ఈ సినిమా కోసం ‘కొండారెడ్డి బురుజు’ దగ్గర పలు సన్నివేశాలని చిత్రీకరించారు. అవి సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోనూ కొండారెడ్డి బురుజు కనిపించనుంది. హైరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు సెట్ ని వేశారు. ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో కొండారెడ్డి బురుజు ముందు మహేష్ నిలబడి ఉన్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. “16యేళ్ల  క్రితం ఈ కట్టడం (కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కట్టడం వద్ద మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు” అంటూ రాసుకొచ్చారు.

ఈ చిత్రలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర-దిల్ రాజు-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.