వైకుంఠపురంలో తొలి రికార్డ్.. ఇదే !


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆకలితో ఉన్నారు. అభిమానుల ఆకలిని తీర్చాలనే కసితో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. అందుకే ఆయన మరోసారి త్రివిక్రమ్ తో జతకట్టారు. వీరి కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈసారి రికార్డులు బద్దలవ్వడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. అది నిజమే అన్నట్టు రిలీజ్ ముందు రికార్డులకి తెరలేపింది ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా. 

ఈ సినిమా నుంచి తొలిసాంగ్ గా ‘సామజవరగమన’ వచ్చేసిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ స్వరఝరికి, వెస్ట్రన్ టచ్ ఇస్తూ, ప్యూజన్ స్టయిల్ లో ఈ పాటను చేశారు. ఐతే ఈ మిక్సింగ్ లో కూడా దేశీయ వాయిద్యాలకే పెద్దపీట వేసారు. ఈ పాటని సిరివెన్నెల రాశారు. సిద్దూ శ్రీరామ్ ఆలపించారు. పాట అద్భుతంగా ఉంది. రిలీజైన 24గంటల్లో 6మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది.. ఈ పాట. అంతేకాదు.. యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. అత్యధిక మంది చూసిన తెలుగు సాంగ్ గా రికార్డ్ సృష్టించింది.

తొలి పాటతోనే ‘అల.. వైకుంఠపురంలో’ రికార్డులకి తెరలేపింది. ఇక టీజర్, ట్రైలర్, సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు అవుతాయన్నది చూడాలి. ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లకి సినిమాలో మంచి పాత్రలు దక్కాయని చెబుతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.