ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం !

సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గం శనివారం సమావేశం కానుంది.ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గం సమావేశం కానుంది. అలాగని ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగదు. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై శనివారం జరగనున్న కేబినేట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారమ్.

ఇంకా చెప్పాలంటే 50+30+20 ఫార్ములాకి కేసీఆర్ కేబినేట్ ఆమోదం తెలపనుంది. ఆర్టీసీలో సగం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, మిగతా 20 శాతం ప్రైవేట్ స్టేజ్ కేరియర్లు ఉండాలన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగా ఇప్పటికే 26 శాతం ఉన్న అద్దె బస్సులకు అదనంగా మిగతా 4శాతం అద్దెబస్సులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇక మిగిలేది.. ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇవ్వడమే. శనివారం జరగనున్న కేబినేట్ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారమే సీఎం కేసీఆర్ 50+30+20 ఫార్ములాని అమలు చేయబోతున్నారు.