తహశీల్దార్‌ హత్యకేసు : నిందితుడు సురేష్ పరిస్థితి విషమం

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవ దహనం ఘటన నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. దాదాపు 35 శాతం కాలిన గాయాలతో సురేష్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్యంపై చెప్పలేమని వైద్యులు తెలిపారు.

ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన విజయారెడ్డి డ్రైవర్ గురునాథమ్ హైదరాబాద్ అపోలో అసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాథం 80శాతం కాలిపోయాడు. గత ఎనిమిదేళ్లుగా గురునాథమ్ విజయారెడ్డి డ్రైవర్ గా పని చేస్తున్నారు. మంచి నమ్మకస్తుడిగా పేరున్న గురునాథమ్ మరణం అందరినీ కలచి వేస్తోంది.

ఇక, ఈ ఘటనపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే విజయారెడ్డి హత్య జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులను దొంగలుగా చిత్రీకరించే యత్నం జరుగుతోందన్నారు. విజయారెడ్డి కుటుంబాన్ని సీఎం పరామర్శించాలన్నారు.