తారక్ తో త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా సినిమా !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తారక్ చేయబోయే సినిమా గురించి రకరకాల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్యాన్ ఇండియా సినిమా గనుక.. తన తదుపరి సినిమాని కూడా అదే విధంగా ప్లాన్ చేయాలని తారక్ భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తారక్ తదుపరి సినిమా కోసం పరభాష దర్శకులు ప్రశాంత్ నీల్, అట్లీ పేర్లు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే ప్రశాంత్ నీల్ చెప్పిన కథని తారక్ ఓకే చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి తారక్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే ఉండనుందట. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక హాసిని సంస్థలో ఈ చిత్రం వుండవచ్చునని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కనుక ఘన విజయం సాధించి, ఎన్టీఆర్‌కి పాన్‌ ఇండియా మార్కెట్‌ వస్తే దీనినే భారీ స్థాయిలో తెరకెక్కిస్తారు. అంటే తారక్-త్రివిక్రమ్ కాంబోలో ప్యాన్ ఇండియా సినిమా రావొచ్చన్న మాట. అదే నిజమైతే.. తారక్, త్రివిక్రమ్ ఒకేసారి బాలివుడ్ కి వెళ్లినట్టు అవుతోంది. ఇక రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ తర్వాత పరబాష దర్శకులతో చేసేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదట. కొరటాల శివ దర్శకత్వంలోనే చరణ్ తదుపరి సినిమా ఉండనుందని తెలుస్తోంది. 

మొత్తానికి.. ఆర్ ఆర్ ఆర్ హీరోలిద్దరు పరభాష దర్శకుల కంటే తెలుగు బాష దర్శకులనే నమ్ముకొంటున్నారు. పాన్‌ ఇండియా మార్కెట్‌ వచ్చినంత మాత్రాన తెలుగు రూట్స్‌ వదిలేసి నేల విడిచి సాము చేయడానికి తారక్‌, చరణ్ ఇద్దరూ ఇష్టపడడం లేదు. ఇది మంచి పరిణామమే. తెలుగు టాప్ దర్శకులైన త్రివిక్రమ్, కొరటాల లాంటోళ్లు ప్యాన్ ఇండియా సినిమాలు ఎందుకు చేయకూడదు ?.