ఇంగ్లీష్ మీడియం జీవోలో మార్పులు

ప్రభుత్వం పాఠశాలలు అన్నింటిలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలొచ్చినా.. సీఎం జగన్ వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తదితర పిల్లలు, మనవళ్లు ఎందుకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లల్లో చదువుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇదివరకే ఇంగ్లీష్ మీడియం అమలుపై జీవో ఇచ్చింది. అందులో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

తాజాగా ఈ జీవోలో కొన్ని మార్పులు చేసింది. 1వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు కాకుండా.. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. ఇంగ్లీష్ బోధనలో ప్రావీణ్యం ఉన్న టీచర్లను రానున్న రోజుల్లో నియమించాలని సంబంధిత శాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలుగు లేదా ఉర్దూను కచ్చితమైన సబ్జెక్ట్‌గా ఉంచాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.