సరిలేరు రిలీజ్ ఒకరోజు ముందుగానే 

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అయితే అదే రోజు అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో..’ కూడా విడుదల కానుంది. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడంతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ నెలకొని ఉంది. అభిమానుల మధ్య వివాదాలకి దారితీసేలా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల రిలీజ్ డేటు మార్చేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు సాగాయి. ఇప్పుడవి ఫలించాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత అనుకున్నరోజు కంటే ఒక్కరోజు ముందుగా.. అనగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుగు చిత్ర నిర్మాతల సంఘం తెలిపింది. 

సరిలేరులో మహేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్‌ భారతి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.