బ్రేకింగ్ : సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెను విరమిస్తున్నామని, ఇన్నాళ్లు పనిచేసిన ప్రైవేట్ కార్మికులు విధుల నుంచి వెళ్లిపోవాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ప్రభుత్వం బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

వాస్తవానికి నాలుగైదు రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు సమ్మెని విరమించారు. ఐతే, వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఆర్టీసీని తిరిగి యదాతథంగా నడపడం వీలుకాదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఐతే, ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాల నుంచి వస్తున్న విజ్ఝప్తులని దృష్టిలో పెట్టుకొని కార్మికులని విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం కేసీఆర్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాతే కార్మికులని విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రేపటి నుంచి ఆర్టీసీ బస్ లు ఎప్పటిలాగే నడవబోతున్నాయి.