మహేష్ ముందడుగు.. బన్నీ వెనకడుగు.. !!

27 ఏప్రిల్, 2018. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్దమే జరగబోతుందని భావించారు. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు “భరత్ అను నేను”, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాలు రిలీజ్ కానుండటమే ఇందుకు కారణం. ఐతే, వీరి యుద్దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ చెక్ పెట్టేసినట్టు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ రోబో #2.Oని ఏప్రిల్ 27 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మహేష్, బన్నీలు పోటీ నుంచి తప్పుకోవడం తప్పడం లేదు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ “భరత్ అను నేను” సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు భరత్ విషయంలో ఆ రేంజ్ ని మించి అంచనాలున్నాయి. ఐతే, ఏప్రిల్ 27న సూపర్ స్టార్ రజనీకాంత్, బన్నీలతో పోటీపడటం మహేష్ కు అస్సలు ఇష్టం లేదు. దీంతో.. మరో రెండు వారాలు ముందుకు అంటే ఏప్రిల్ 13 నే మహేష్ వచ్చేస్తున్నాడు.

రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న బన్నీ సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంచనాలు భారీగానే ఉన్నాయి. సరైనోడు, డీజే సినిమాల తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీకి మహేష్ తో పోటీపడటం ఇష్టం లేకపోయినా.. ఇప్పుడే వెనకడుగు వేస్తే సోషల్ మీడియాలో దుష్పచారం జరుగుతుందని భావించారు. ఇంతలో సూపర్ స్టార రజనీకాంత్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ ఎఫెక్ట్ తో మహేష్ కాస్త ముందడుగు వేసేశాడు. ఇప్పుడు బన్నీ వెనకడుగు వేయక తప్పదేమో.. ! అంటే.. ఏప్రిల్ 27న కాకుండా బన్నీ మే నెలలో వచ్చేసే అవకాశాలున్నాయి.