కోహ్లీపై బిగ్ బీ ప్రశంసలు


హైదరాబాద్‌లో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 94 పరుగులు చేసి జట్టుని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లీ.. బుక్‌ తీసి టిక్‌ కొట్టినట్లు చేసిన సంజ్ఞ నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. 

గత వెస్టిండీస్‌ పర్యటనలో కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు విలియమ్స్‌ చేసిన సంబరాలను దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చాడు. దీనిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘విరాట్‌ను కవ్వించొద్దని ఎన్నో సార్లు చెప్పాను. కానీ వారు నా మాట వినలేదు. దీంతో కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు. చూడండి ఇప్పుడు.. వెస్టిండీస్‌ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో’ అని బిగ్ బీ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇటీవల అనారోగ్యానికి గురైన బిగ్ బీ ఇకపై సినిమాలు తగ్గించేయాలని, దాదాపు మానేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.