అభిమానుల‌కు ఎన్నిక‌ల్లో టిక్కెట్లివ్వ‌ను…!

 

విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల్లో సీట్ల‌పై ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అభిమానుల‌కు ఎన్నిక‌ల్లో టిక్కెట్లివ్వ‌న‌ని తేల్చి చెప్పారు. సినీ అభిమానం వేరు, రాజ‌కీయం వేర‌ని ఆయ‌న అన్నారు. ఇలా చెబుతున్నాన‌ని ఎవ‌రూ ఏమీ అనుకోవ‌ద్ద‌ని, ఎన్నిక‌ల్లో సీట్లిస్తాన‌ని అభిమానులు త‌న‌పై అతిగా న‌మ్మ‌కం పెట్టుకోవ‌ద్ద‌ని ఆయ‌న చెప్పారు.

గ‌తంలో త‌న సోద‌రుడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీకి ఇదే పెద్ద మైన‌స్ అయ్యింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల్లో అభిమానుల‌కు సీట్లిస్తార‌ని ఆశించి, అభిమానులంతా పార్టీకి బాగా ప‌నిచేశారని, ముందునుంచీ స్ప‌ష్టత లేక‌పోవ‌డం వ‌ల్ల చివ‌ర‌కు అభిమానులు నిరాశ‌కు గుర‌య్యార‌ని, అదే ఎన్నిక‌ల్లో పీఆర్పీ స‌మ‌స్య‌లు తెచ్చిపెట్టింద‌ని ఆయ‌న అన్నారు.

అలాంటి పొర‌పాట్లు మ‌ళ్లీ జ‌న‌సేన విష‌యంలో జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఈనిర్ణ‌యం తీసుకుంటున్నాన‌ని ఆయ‌న చెప్పారు. స‌మ‌ర్థ‌త ఆధారంగానే ఎన్నిక‌ల్లో సీట్లిస్తామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు.