అలీ కుటుంబానికి పవన్ సంతాపం

ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. జైతున్‌ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖులు అలీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి అలీ ఇంటికి సంతాపం తెలియజేశారు. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా అలీ కుటుంబానికి సంతాపం తెలిపారు.

‘అలీ తల్లి జైతున్‌ బీబీగారు తుదిశ్వాస విడిచారని తెలిసి బాధ అనిపించింది. బీబీగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంతో బలమైందో తెలుసు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అంటూ జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. 

చిత్రసీమలో అలీ-పవన్ కల్యాణ్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ జనసేనలో చేరుతారని అందరూ భావించారు. కానీ, ఆయన వైకాపాలో చేరారు. దీనిపై స్పందించిన అలీ స్నేహం వేరు, రాజకీయాలువేరన్నారు. పవన్ మాత్రం అలీపై ఒకట్రెండు సందర్భాల్లో పరోక్ష విమర్శలు చేశారు. దాంతో.. అలీ-పవన్ ల స్నేహం చెడిందనే ప్రచారం జరిగింది.