ఇక తెలంగాణ‌పై చంద్ర‌బాబు దృష్టి…!

తెలంగాణ టీడీపీ పై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ గా దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోని ప‌లువురు కీల‌క‌నేత‌లు కాంగ్రెస్ లోకి చేర‌డంతో తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై ఆయ‌న చాలేంజ్ గా తీసుకున్నారు. అందులో భాగంగా శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ భ‌వ‌న్ లో టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఇక నుంచి ప్రతి గురువారం తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు తెలికాన్ఫిరెన్స్ నిర్వ‌హించ‌డ‌మే కాకుండా నెలరోజుల్లో ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ ల నియామకం చేప‌ట్టాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. త్వరలో నియోజకవర్గల వారిగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి, లోకసభ నియోజకవర్గలకు ఇంచార్జ్ ల నియామకం చేప‌ట్ట‌నున్నారు. ఇందుకోసం 40మంది సీనియర్ నాయకులు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు చంద్ర‌బాబు.

వీటితో పాటు జనవరి18నుంచి మార్చ్ 29 వ‌ర‌కు పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమం చేప‌ట్టి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతినెలా టిటిడిపి నేతలతో బాబు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. పొత్తుల పై ఇప్పుడు చర్చ అనవసరమ‌ని , టీటీడీపీ తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయం అనేలా ఎద‌గాల‌ని చంద్ర‌బాబు సూచించిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ లో పార్టీలో చేరేందుకు కొంత మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారని, వారిని త్వరలో పార్టీలో చేర్చుకుందామ‌ని బాబు టీటీడీపీ నేత‌ల‌కు చెప్పారు. పార్టీలోకి వ‌చ్చే వారిని చేర్చుకోండ‌నిఇ దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఏపీలో టీడీపీదే అధికార‌మ‌ని, అక్క‌డ అంతా సెట్ చేశాన‌ని, ఇక ఈ ఏడాదిన్న‌ర తెలంగాణ పై ఎక్కువ దృష్టి పెడ‌తాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.