సీఎం కేసీఆర్’కు ప్రధాని అపాయింట్ మెంట్ దక్కకుండా చేస్తారట

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ దక్కకుండా చేస్తానని అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాబు రావు అన్నారు.సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కుతారు. ఇక్కడకు వచ్చి తిడతారని విమర్శించారు. అందుకే సీఎం కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వొద్దని ప్రధాని మోదీకి చెప్పానని సోయం చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు కూడా నడవదన్నారు.

సీఎం కేసీఆర్‌ ఒంటెత్తు పోకడలతో రాష్ట్రం సర్వనాశనమవుతోందని ఎంపీ సోయం ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని సోయం స్పష్టం చేశారు. ఇక ఇటీవల ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ ప్రకటనపై ఎంపీ సోయం స్పందించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా మరో రాజధానిగ ఆదిలాబాద్ ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐతే, సోయం వ్యాఖ్యలకి సొంత పార్టీ నేతల నుంచే మద్దతు దొరక్కపోవడం విశేషం.