కడప స్టీల్ ప్లాంట్’కు శంకుస్థాపన చేసిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కడపజిల్లా పర్యటనకి వెళ్లారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్లాంటు కోసం 3,200 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 2 టీఎంసీల నీటిని కూడా కేటాయించింది. ఐరన్ ఓర్ కోసం ఎన్ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. “చంద్రబాబులోని మోసపూరిత గుణాన్ని, తనలో ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్టీల్‌ప్లాంట్‌కు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారని, వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం, ప్లాంట్‌ కు కావాల్సిన నీరు, ముడి ఇనుము, తదితర అన్ని సౌకర్యాల కల్పనకూ సంబంధిత విభాగాలు, కంపెనీల నుంచి అనుమతులు తెచ్చిందన్నారు.3 మూడు సంవత్సరాల వ్యవధిలోనే స్టీల్ ప్లాంట్ ని పూర్తి చేస్తామని, ఆపై 27 వేలకు పైగా ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని సిఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.15 వేల కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కు సీఎం జగన్‌ కృతజ్ఞతలు” తెలిపారు