మత్తు వదలరా.. రానా కామెంట్స్ !

టాలీవుడ్ లో రొటీన్ సినిమాల మత్తు వదిలించిన చిత్రంగా అనిపించుకుంది ‘మత్తు వదలరా’. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రితేశ్ రానా దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ పై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి ప్రభాస్ ‘మత్తు వదలరా’ కిక్కునిచ్చిందన్నారు. అంతేకాదు.. మత్తు వదలరా చిత్రబృందంతో చిట్ చాట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని నేడు విడుదల చేయనుంది చిత్రబృందం. తాజా భల్లాలదేవుడు రానా దగ్గుపాటి మత్తు వదలరా పై స్పందించారు.

తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియోని విడుదల చేశారు రానా. ”మత్తువదలరా’ చూశాను. ఇలాంటి మంచి సస్పెన్స్‌ చిత్రాన్ని అందించిన డైరెక్టర్‌ రితేశ్‌ రానాకు అభినందనలు. సస్పెన్స్‌ చిత్రాలను ఇష్టపడే నాకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. సన్నివేశాలకు అనుగుణంగా కాలభైరవ అందించిన సంగీతం చాలా అద్భుతంగా ఉంది. సింహా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తన నటన చాలా బాగుంది. ఈ సినిమా చూశాక నటుడిగా తను ఎదిగాడనిపించింది. నిర్మాతలకు కంగ్రాట్స్‌. మీరు కూడా ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూడండి. ఎంజాయ్‌ చేయండి. తెలుగులో ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా”నని రానా అన్నారు.