ఎమ్మెల్యే రోజాపై ఎటాక్.. సొంత పార్టీ నేతలే !

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె సొంత పార్టీ నేతలే దాడి చేయడం విశేషం. ఆదివారం ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ సందర్భంగా రోజాని సొంత పార్టీకి చెందిన అమ్ములు అనుచరులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా రోజా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వైసీపీ నేత అమ్ములు, అతని అనుచరులు దాదాపు 20 మంది రోజా కారును అడ్డగించారు. సుమారు 20 నిమిషాల పాటు ముందుకు కదలనివ్వలేదు. వారికి సర్థిచెప్పేందుకు ఎమ్మెల్యే రోజా ప్రయత్నించినప్పటికీ.. వైసీపీ కార్యకర్తలు మాత్రం మాట వినలేదు.పెద్ద ఎత్తున రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాగొలా బయటపడిన రోజా.. అమ్ములుపై పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్. అంతేకాదు.. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.