మరోసారి అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి

అగ్రరాజ్యం అమెరికాని ఎదురించే విషయంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో స‌మ‌రానికి దిగేందుకు ఇరాన్ వెనుకాడుతుంద‌ని ట్రంప్ కామెంట్ చేసిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే మరోసారి ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. బ‌గ్దాద్‌లో ఉన్న గ్రీన్‌జోన్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ రెండు రాకెట్ల‌తో దాడికి పాల్ప‌డింది.

గ్రీన్‌జోన్‌లోనే అమెరికా దౌత్య కార్యాల‌యం ఉన్న‌ది. గ్రీన్‌జోన్‌లో రెండు క‌త్యూషా రాకెట్లు ప‌డిన‌ట్లు ఇరాక్ సైన్యం వెల్ల‌డించింది. గ్రీన్‌జోన్ ప్రాంతంలో అమెరికాతో పాటు ఇత‌ర పాశ్చాత్య దేశాల దౌత్య కార్యాల‌యాలు ఉన్నాయి. రాకెట్ల వ‌ల్ల ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గలేద‌ని తెలుస్తోంది.

మరోవైపు బుధవారం ఇరాన్ చేసిన క్షిపణుల దాడిలో దాదాపు 80మంది అమెరికన్ జవాన్లు మరణించి ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ, అందులో ఎలాంటి నిజం లేదు. ఏ ఒక్క అమెరికన్ జవాన్ మరణించలేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.