213కు చేరిన కరోనా మృతుల సంఖ్య, 25దేశాలకి వ్యాప్తి !


కరోనా వైరస్‌ విస్తరిస్తున్న తీరు..రోజురోజుకీ మరణాలు సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితి (గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడానికి చైనా తీసుకుంటున్న చర్యల్ని కొనియాడిన డబ్ల్యూహెచ్‌ఓ.. ఇతర దేశాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.

చైనాలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 213కు చేరింది. మరో 9816 మందికి ఈ వైరస్‌ సోకినట్టు గుర్తించారు. ఒక్క చైనాలోనే 9692 మందిని బాధితులుగా గుర్తించగా.. హాంగ్‌కాంగ్‌లో 12, మకావు 7, తైవాన్‌ 9, ఇతర ఆసియా దేశాల్లో 62, ఐరోపాలో 13, ఉత్తర అమెరికాలో 8, ఆస్ట్రేలియాలో 9, ఇతర ప్రాంతాల్లో 4 కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకినట్లు ధ్రువీకరించారు. భారత్ లో కేరళలో తొలి కరోనా వైరస్ కేసు బయటపడింది. ఐతే, చైనాలో తప్ప మరే దేశంలోనూ కరోనా వైరస్ సోకి ఎవరు మృతి చెందలేదు.