కర్నూలుకు విజిలెన్స్ కమిషనర్ ఆఫీస్

ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ శాసనసభ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుని శాసనమండలి అడ్డుకోవడంతో.. ఆ మండలినే రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకముందే.. రాజధాని తరలింపుపై సీఎం జగన్ సర్కార్ దృష్టిసారించింది.

రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో  విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం నుంచి పనిచేస్తున్నాయి. పరిపాలన కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.