‘శీనయ్య’ సినిమా ఆగిపోయింది.. కారణమేంటంటే ?

మాస్ దర్శకుడు వి.వి వినాయక్ హీరోగా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘శీనయ్య’ తెరకెక్కుతోంది. ‘దిల్’ రాజు నిర్మాణంలో .. ‘శరభ’ ఫేమ్  నరసింహా దర్శకత్వంలో ‘శీనయ్య’ సినిమా మొదలైంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఐతే, రషెస్ చూసిన వినాయక్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఈ సినిమాని ఇక్కడితోనే ఆపేస్తే మంచిది. లేదంటే.. భారీ నష్టాలు ఖాయమని చెప్పాడట. వినాయక్ అభిప్రాయంతో దిల్ రాజు ఏకీభవించడం.. శీనయ్య సినిమాని ఆపేయడం జరిగిపోయినట్టు సమాచారమ్.

ఇక ఈ సినిమా కోసం వినాయక్ బాగానే కష్టపడ్డాడు. సన్నగా మారాడు. మెగాస్టార్ చిరంజీవి లుక్ లోకి మారిపోయాడు. అసలే దర్శకుడిగా వరుస ప్లాపుల్లో ఉన్నాడు వినాయక్. సినిమాలు చేసేందుకు హీరోలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన హీరో అవకాశంతో ముచ్చట తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ, దర్శకుడు కథని సరిగ్గా డీల్ చేయకపోవడంతో.. శీనయ్యని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.