‘విరాటపర్వం’లో చేరిన నందితా దాస్

రానా దగ్గుబాటి-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. గత యేడాది జూన్ లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. మధ్యలో ఆగిపోయింది. దానికి కారణం రానాకి అనారోగ్యానికి గురికావడం, చికిత్స కోసం అమెరికాకి వెళ్లడమే కారణమని తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.

ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ ని పూర్తి చేసుకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నందితా దాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా నందితా దాస్ ట్విట్ చేశారు.

‘తొలిసారిగా తెలుగు సినిమాలో నటించడం ఎంతో అనందంగా ఉంది’ అంటూ షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటోని ఆమె షేర్ చేశారు. ఇక 1990 నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో విరాటపర్వం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.