ఎర్రగడ్డ-భరత్ నగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ-భరత్ నగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 అడుగుల ఎత్తు నుంచి కారు పల్టీలు కొడుతూ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బోరబండకు చెందిన సునీల్ (22), మహ్మద్ సొహైల్ (27), మోహిజ్ (19), గౌస్ (20), ఇర్ఫాన్ (18), అశ్వక్ (18) స్నేహితులు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారే. అర్ధరాత్రి తరువాత.. నగరంలో సరదాగా షికారుకెళ్లాలని భావించారు.

సొహైల్ బంధువుకు చెందిన కారులో బయలుదేరారు. లారీ డ్రైవర్ గా అనుభవమున్న సునీల్ కారు నడిపించారు. ముందుగా హైటెక్ సిటీలోని ఓ హోటల్ లో బిర్యానీ తిన్నారు. అక్కడి నుంచి బాలానగర్ చౌరస్తాకు చేరుకుని చాయ్ తాగారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 2.10 గంటలకు మూసాపేట వైపు నుంచి భరత్ నగర్ పైవంతెనపైకి చేరుకున్నారు. ఐతే, అతివేగంతో కారు అదుపు తప్పి బ్రిడ్జి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సొహైల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.