నిరహారదీక్షకి దిగిన వెంకట్ రెడ్డి

చేర్యాలని డివిజన్ గా మార్చాలని డిమాండ్ చేస్తూ.. భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. సిరిసిల్ల, నారాయణపేట్‌ వంటి ప్రాంతాలను జిల్లాలుగా చేసిన సీఎం కేసీఆర్‌ చేర్యాల డివిజన్‌ చేయడంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

1969లో తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజలే తూటాలకు బలయ్యారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చేర్యాల ప్రాంత ప్రజల కృషి మరువలేనిదని ఎంపీ కోమట్ రెడ్డి ప్రశంసించారు. 4 నెలల నుంచి చేర్యాల ప్రజలు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్యాలని డివిజన్ గా ప్రకటించే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎంపీ తెలిపారు.