తెలంగాణ ద్రోహులని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది !

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. మాటాకు మాట అనుకున్నారు. నువ్వేంత అంటే.. నువెంత వరకు వచ్చింది. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మాణంపై జరిగిన చర్చ సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డి  మాట్లాడారు.

గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించారని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో తిరుగుతుంటే అర్థమవుతోంది.. స్థానికంగా భయంకరమైన పరిస్థితులున్నాయి. ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. గవర్నమెంట్‌ స్కూళ్లలో మౌలిక సదుపాయాలే లేవన్నారు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సరిపోతుందా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డిపై ఎందుకు లేదని ప్రశ్నించారు.

రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా జోక్యం చేసుకున్న మంత్రి ఎర్రబెల్లి.. రాజగోపాల్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నాడా ? రోడ్లపై తిరుగుతున్నాడా ? అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మాట్లాడేటపపుడు అర్థం పర్థం ఉండాలి. పోదాం పదా .. నాతో.. ఏ జిల్లాకంటే ఆ జిల్లాకు పోదాం. కోమటిరెడ్డిని పరిగెత్తిచ్చి కొడతారంటూ తీవ్ర స్వరంతో అన్నారు. దానికి కోమట్ రెడ్డి అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. “ఇది ఆయన తప్పుకాదు.. తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి నెత్తినపెట్టుకున్న సీఎం కేసీఆర్ ది” అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా హీటెక్కింది.