రైలు బోగీలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఇలా.. !

దేశంలో కరోణా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 13వేలకు పైగా ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసింది. ఈనేపథ్యంలో రైళ్లలో ఉండే బోగీలను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ దిశగా కసరత్తులు చేసిన రైల్వేశాఖ రైలులోని బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా విడుదల చేసింది. సరైన వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా అత్యవసర సేవలు అందించవచ్చనే ప్లాన్ లో భాగంగా రైల్వే బోగిలని ఐసోలేషన్ కేంద్రాలుగా రెడీ చేశారు.

రైల్వే బోగిలో ఐసోలేషన్‌ కేంద్రాలు.. ఏమి సదుపాయాలు కల్పించారంటే.. ?

ప్రతి బాత్‌రూమ్‌లో హ్యాండ్‌ షవర్‌, ఒక బకెట్‌. సైడ్‌ మిడిల్‌ బెర్త్‌లను తొలగించి ఒక్కో కూపేలో ఇద్దరి నుంచి నలుగురు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో రెండు మరుగుదొడ్లను బాత్‌రూమ్‌లుగా మార్చారు. ఇందులో కూడా ఫ్లోటింగ్ టాయిలెట్‌ పెన్‌ ఏర్పాటు చేశారు. ఐసోలేషన్‌కు వచ్చే వారి సామగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాలు ఏర్పాటు చేసారు. వైద్య పరికరాలను నడపడానికి కంపార్ట్‌మెంట్లో 220 వోల్ట్‌ విద్యుత్‌ అనుసంధానం చేశారు. ప్రతి కూపేకు ప్రత్యేకంగా కర్టెన్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో పది ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దారు. కోచ్‌ బయట.. రోగుల కోసం వెలుప 415 ఓల్ట్స్‌ విద్యుత్‌ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు.  ఐసోలేషన్‌కోసం తయారు చేసిన కోచ్‌లను నిత్యం శానిటైజ్‌ చేస్తున్నారు. ఐసోలేషన్ వార్డును ఉపయోగించే ముందు, తరువాత కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.