వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం పట్టివేత

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం షాపులు మూతపడ్డాయి. దీంతో మందు బాబులు పిచ్చోళ్లు అవుతున్నారు. పిచ్చాసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో చేతిలో ఫుల్ బాటిల్ ఉంటే వాడు ధనవంతుడు, కోటీశ్వరుడు. అంతేకాదు.. ఒక్క ఫుల్ బాటిల్ మద్య ధర ఏకంగా 3 నుంచి 4 వేలు పలుకుతోంది. ఇలాంటి సమయంలో ఏపీలో వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం పట్టుపడటం హాట్ టాపిక్ గా మారింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి. పలుచోట్ల భారీగా మద్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, సీఐ తిరుపతయ్య నేతృత్వంలో సిబ్బంది గడికోటలో సోదాలు నిర్వహించారు. శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో 1200 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాక్‌డౌన్‌  నేపథ్యంలో ఆయన కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నట్టు సమాచారమ్.